అక్రమంపై జగన్‌కు సుప్రీంలో షాక్: బెయిల్‌పై సిబిఐకి...

Published: Thursday, August 9, 2012, 11:21 [IST]

YS Jagan - Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. తన అరెస్టు అక్రమమంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం తిరస్కరించింది. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.

మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ చేసుకున్న పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు గురువారం విచారించింది. జగన్‌కు బెయిల్ ఇవ్వడం పైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా చెప్పాలని ప్రతివాది సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి కోర్టు నోటీసులు జారీ చేసింది.

సిబిఐ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో రెండో నిందితుడుగా ఉన్న విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిని కూడా ఇవ్వాలే విచారించిన కోర్టు విజయ సాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్ పైన రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. జగన్ సంస్థల ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా ఉన్న విజయ సాయి రెడ్డి బెయిల్ పైన బయట ఉంటే విచారణకు ఆటంకం కలుగుతుందని వాదించారు. విచారణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే విజయ సాయి బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని న్యాయవాది కోర్టును కోరారు.

Story first published: Thursday, August 09, 2012, 11:21 [IST]